రచయితగా మారాలంటే ఏం పుస్తకాలు చదవాలో చెప్పడానికి గొప్ప రచయితలో, పెద్ద రచయితలో అయి ఉండాలంటే నేను ఈ సమాధానం చెప్పడానికి అనర్హుడిని. ఎందుకంటే నేనేమీ రచయితను కాదు. కానీ కాస్తో కూస్తో మంచివో, చెడ్డవో పుస్తకాలంటూ చదివే అలవాటు ఉంది కాబట్టి నా అవగాహన మేరకి ఇది రాస్తున్నాను.
రచయితగా మారడానికి చదవాల్సిన పుస్తకాల జాబితా కేవలం ‘ఏం చదవాలి' అనేదానిపైనే కాకుండా, 'ఎందుకు చదవాలి' మరియు 'ఎలా చదవాలి' అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక మంచి రచయితకు ఉండవలసిన ప్రధాన లక్షణాలు… అవగాహన, భాషా పటుత్వం, కథాకౌశలం, కల్పనా చాతుర్యం.
రచయితగా మారటానికి ప్రత్యేకంగా చదవాల్సినవి ఇవే అంటూ ఖచ్చితమైన పుస్తకాల జాబితా ఉండదు. ఎందుకంటే ప్రతి రచయిత శైలి, అభిరుచి, ఇతివృత్తం భిన్నంగా ఉంటాయి. రచయితకి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధాన లక్షణం ఏమిటంటే మన చుట్టూ ఉన్న జీవితం చదవడం. రచయితకి అనే కాదు, ఏ మనిషికైనా సమాజమే పెద్ద పుస్తకం. ప్రపంచమే పెద్ద గ్రంధాలయం.
మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి ఒక పాత్రే. ప్రతి మనిషి జీవితం ఒక ఒక కథే. చుట్టూ ఉన్న ప్రతి మనిషినీ ఒక నవలలోని పాత్రలా చూడటం ప్రారంభించండి. వారి ప్రవర్తన, మాట తీరు, భావోద్వేగాలు, కష్టాలు, సంతోషాలను నిశితంగా గమనించండి. రచయితకు కావలసిన అసలైన ముడిసరుకు ఇదే. ఒక మంచి రచనకు కేవలం మంచి పాత్రలు ఉంటే సరిపోదు. వాటికి తగ్గట్టుగా వారి చుట్టూ ఉండే ప్రదేశాల మీద పరిజ్ఞానం ఉండాలి. ఇల్లు, ఊళ్ళోని మార్కెట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఫ్యాక్టరీ, కార్యాలయం ఇలాంటివన్నీ కథల గనులు. ఇవన్నీ కథలకు నేపథ్యాన్ని, వాతావరణాన్ని అందిస్తాయి. ఈ ప్రదేశాలలోని శబ్దాలు, వాసనలు, దృశ్యాలను శ్రద్ధగా పరిశీలించి నమోదు చేసుకోండి. పత్రికలు, సంస్కృతి కథలు, సామాజిక మాధ్యమాల్లోని నిజమైన అనుభవాలు, మానవ సంబంధాల సంఘర్షణలు గమనించండి. వాస్తవ ప్రపంచంలో ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై పట్టు సాధించండి.
అలాగే మంచి రచయిత అవ్వడానికి భాష మీద పట్టు ఉండటమూ తప్పని సరి. రచయితకి భాష అంటే ఆయుధం. భాషను అందంగా, మృదువుగా, కఠినంగా, కవితాత్మకంగా, తాత్వికంగా — అవసరానికి అనుగుణంగా వాడే శక్తి రావాలి. దానికి వివిధ రకాల రచయితల రాతలు చదవాలి.
కొన్ని పుస్తకాలు మనలో భావన, భాష, నిర్మాణం, ఆలోచనా లోతుని పెరిగేలా చేస్తాయి. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్న కథలు, నవలలు, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం లాంటి పుస్తకాల వలన సంభాషణల తీరు, వర్ణనాత్మక భాష, తెలుగు భాషలో ఉన్న మాధుర్యం, వాక్య నిర్మాణంలో పరిపూర్ణత అర్థం అవుతాయి.
రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలి, శ్రీశ్రీగారి మహాప్రస్థానం, సినారె గారి కవిత్వం, నగ్నముని కొయ్యగుర్రం, తిలక్ అమృతం కురిసిన రాత్రి, అజంతా చిత్రలిపి, మో కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం లాంటివి చదవడం వలన కవిత్వంలోని భావోద్వేగ తీవ్రత, సమాజం పట్ల నిబద్ధత, కొత్త పదాల, పోలికల వాడకం అవగాహనకు వస్తుంది.
చలం గారి మ్యూజింగ్స్, మైదానం, కొడవటిగంటి కుటుంబ రావు గారి కథల్లాంటి వాటితో లోతైన మానసిక విశ్లేషణ, భావ వ్యక్తీకరణలో నిర్భీతి, సరళమైన, సూటియైన శైలి అలవడుతుంది. చలం గారి రచనలు భావాలను మొహమాటం లేకుండా, సూటిగా వ్యక్తం చేసే శైలిని అలవర్చుకోవడానికి, కొడవటిగంటి కుటుంబరావు (కొకు) కథలు కథనంలో అనవసర విషయాలు లేకుండా, సూటిగా, స్పష్టంగా చెప్పడం ఎలాగో తెలుసుకోవడానికి, ముళ్ళపూడి వెంకటరమణ రచనలు హాస్యాన్ని, పల్లెటూరి మాండలికాన్ని కథలో సమర్థంగా ఉపయోగించే విధానాన్ని నేర్చుకోవడానికి అద్భుతమైన పనిముట్లలాంటివి.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథలు, పాలగుమ్మి పద్మరాజు కథలు (గాలివాన), ఎడ్గార్ అలన్ పో కథలు, ఓ హెన్రీ కథలు, మపాసా కథలు… కథను ప్రారంభించే విధానం, ఉత్కంఠను పెంచడం, ముగింపు ఇవ్వడం లాంటివాటిని మనకు పరిచయం చేస్తాయి.
యుద్ధనపూడి సులోచనా రాణి, అరెకపూడి కౌసల్యా దేవి, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణ మూర్తి, సూర్య దేవర రామ్మోహన రావు లాంటి వాళ్ళ రచనలు పాఠకులని ఎలా ఆకట్టుకోవాలో తెలిపేలా ఉంటాయి. కథనం, సంఘర్షణ సృష్టించడం, పాఠకుడి ఉత్సుకతను పెంచడం, శిల్పం, శైలీ లాంటి వాటి గురించి చక్కని అవగాహన ఏర్పడుతుంది.
రచయితకి కావాల్సిన మరో ప్రధాన లక్షణం లోతైన ఆలోచనలు కలిగి ఉండటం, తాత్వికతలో, తర్కంలో ప్రవేశం ఉండటం. కథను కేవలం వినోదం కోసం కాకుండా, మానవ జీవితపు అంతిమ సత్యాన్ని ప్రశ్నించేలా రాయడానికి ఇది అవసరం. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు, ఓషో రచనలు, వివేకానందుడి సాహిత్యం వంటివి జీవితం, మనిషి ఉనికి, సత్యం గురించి కొత్త కోణాలను, తాత్విక దృక్పథాన్ని పరిచయం చేస్తాయి. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, త్రిపురనేని గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర, రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) కథలు, నవలలు ఇంగ్లీష్ లో జీన్ పాల్ సార్త్రే - నాజియా, ఖలీల్ జిబ్రాన్ - ది ప్రాఫెట్, పాలో కోయిలో - దిఅల్కెమిస్ట్ వంటివి మానవ మనస్తత్వాన్ని, సామాజిక అన్యాయాన్ని లోతుగా ప్రశ్నిస్తాయి. పాత్రల అంతర్గత సంఘర్షణ, భావోద్వేగాల సంక్లిష్టత లాంటి వాటిని కథలో ఎలా ప్రతిబింబించేలా రాయాలో తెలుస్తుంది. ఈ ప్రభావం ఎన్నేళ్ళు గడిచినా మీ రచనల్లో కనిపిస్తుంది.
కేవలం తెలుగు సాహిత్యమే కాకుండా, ప్రపంచంలోని గొప్ప నవలలు చదవడం వలన కథను వివిధ కోణాల్లో చెప్పే విధానం, ప్రపంచ తాత్విక ధోరణులు అర్థమవుతాయి. విస్తృత దృష్టి, మానవతా లోతు లభిస్తుంది. ఉదాహరణకు, లియో టాల్ స్టాయ్ రచనలు వార్ & పీస్ (యుద్ధం శాంతి - బెల్లంకొండ రామదాసు గారు తెలుగులోకి అనువదించారు), అన్నాకరెనినా (తెలుగు అనువాదం తాపీ ధర్మారావు) , మాక్సీం గోర్కీ రచన మదర్ (అమ్మ - క్రొవ్విడి లింగరాజు), ఫియోడోర్ దస్తోయెవ్స్కీ గారి క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ ఆఫ్ కరమజోవ్ గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ గారి వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్, ఆల్బర్ట్ కాముస్ గారి ది ఔట్సైడర్ / ది స్ట్రేంజర్, హెమింగ్వే గారి ది ఓల్డ్ మాన్ అండ్ సీ వంటి రచనలు చదవడం వలన ప్రపంచవ్యాప్త సాహిత్య ధోరణులు అర్థం అవుతాయి. జీవితపు అర్థం, ఉనికి, మనిషి స్వేచ్ఛ, బాధ్యతలపై లోతైన ఆలోచన గలిగిస్తాయి ఇలాంటి రచనలు.
ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి మాలపల్లి, కాళీపట్నం రామారావుగారి యజ్ఞం, వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టిమనిషి, జార్జ్ ఆర్వెల్ గారి 1984, యానిమల్ ఫార్మ్ , హార్పర్ లీ గారి టు కిల్ ఎ మాకింగ్బర్డ్ లాటి రచనలు సామాజిక, రాజకీయ స్పృహని కలిగిస్తాయి. వీటి వల్ల సమాజంలోని అసమానతలు, దోపిడీ, అన్యాయం, వాటిని నిర్భయంగా కథావస్తువుగా ఎంచుకోవడం ఎలానో అర్థం అవుతుంది.
తిరుమల రామచంద్ర గారి హంపీ నుంచి హరప్పాదాకా, ముళ్ళపూడి వెంకట రమణ గారి కోతికొమ్మచ్చి, మహాత్మాగాంధీ గారి సత్యశోధన, అన్నే ఫ్రాంక్ రాసిన ది డైరీ ఆఫ్ ఆ యంగ్ గర్ల్, వాల్టర్ ఐసక్సన్ రాసిన స్టీవ్ జాబ్స్ లాంటి పుస్తకాలు ఆత్మకథల్లో ఆణిముత్యాల్లాంటివి. ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర అద్భుతమైన ట్రావెలోగ్ అని చెప్పాలి.
రచయితగా మీ పరిధిని పెంచుకోవడానికి వివిధ ఇతివృత్తాలను, ప్రక్రియలను పరిచయం చేసే పుస్తకాలు చదవాలి. నవలల్లో చరిత్ర, కల్పనను ఎలా మేళవించాలో తెలుసుకోవడానికి నోరి నరసింహ శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్ వంటి వారి చారిత్రక నవలా రచనలు, కథనంలో వేగం, సస్పెన్స్ ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి తెలుగులో కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు లాంటి వారి రచనలు, ఇంగ్లీష్ లో ఐతే అగాథా క్రిస్టీ నవలలు, ఆర్థర్ కానన్ డోయల్ (షెర్లాక్ హోమ్స్) పుస్తకాలు చదవాలి. వాస్తవంలో ఊహను, అద్భుతాన్ని ఎలా కలపవచ్చో తెలుసుకోవడానికి మాజికల్ రియలిజంలో రాసిన పుస్తకాలు చదవాలి. ఇవి తెలుగులో అరుదనే చెప్పాలి. (వచ్చి ఉండవచ్చు కానీ నాకు అవగాహన లేదు). ఇంగ్లీష్ లో మాత్రం గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్ పుస్తకం ఐతే ఒక అద్భుతమైన రచన. అలానే హరుకి మురకమి రాసిన కాఫ్కా ఆన్ ది షోర్ కూడా!
భాషలో వస్తున్న మార్పులను, మాండలికాలను, వాడుక భాషను అర్థం చేసుకోవడానికి విరివిగా చదవాల్సింది మనుషుల్ని సమాజాన్ని అయితే, ఇతర భాషల్లోని రచనా ధోరణులను తెలుసుకోవడానికి అనువాదాలను చదవడంకూడా అంతే ముఖ్యం.
చివరికి, రచయితగా మారటానికి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఎక్కువ చదవడం, విభిన్నంగా చదవడం, లోతుగా చదవడం, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి రాస్తూ ఉండటం… ఎక్కువగా రాయడం. మీరు చదివే ప్రతి పుస్తకం, చూసే ప్రతి జీవితం, వినే ప్రతి మాట మీ రచనకు ప్రేరణగా మారుతుంది. మీరు ఏ ప్రక్రియలో రాయాలనుకుంటున్నారో (చారిత్రక, సైన్స్ ఫిక్షన్, ప్రేమకథ) వాటికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ రచనలను చదవాలి. రచనా ప్రక్రియ గురించి గొప్ప రచయితలు రాసిన పుస్తకాలు చదవడం కూడా చాలా ఉపయోగ పడుతుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం, నవలా శిల్పం, పోరంకి దక్షిణామూర్తి గారి కథానిక స్వరూప స్వభావాలు, ఇంగ్లీష్ లో స్టీఫెన్ కింగ్ గారి ఆన్ రైటింగ్, అలాగే ఎలిస్ వాల్కర్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయితల డైరీల నుండి వారి రచనా పద్ధతులు తెలుసుకోవచ్చు.
రచయిత కావడానికి, ఏది చదివామనే దాని కంటే, చదివిన దాని నుండి ఏమి నేర్చుకున్నాము, ఎలా రాస్తున్నాము అనేదే ముఖ్యం. చదివే ప్రతి అక్షరం ఒక పాఠమే. మీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని, మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. రాసేడప్పుడు మాత్రం వీటన్నిటి ప్రభావాన్నీ మర్చిపోయి మీ సొంత గొంతుకతో రాయడం ప్రారంభించాలి.
నేను చెప్పిన వాటికన్నా ఎన్నో రెట్ల మంచి పుస్తకాలు ఉండి ఉంటాయి. వాటి పేరు ఇక్కడ రాయకపోవడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదని మనవి. ఇక్కడ నేను ఉదాహరణగా రాసిన పుస్తకాలు ఇది రాసే సమయంలో నేను చదివిన, నాకు గుర్తుకువచ్చిన పుస్తకాలు మాత్రమే. మీకు తెలిసిన మంచి పుస్తకాలని ఇక్కడ పంచుకోండి.












