మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 4 September 2010

నాయకుల అనారోగ్యాలకూ ప్రజావసరాలు బలి అవ్వాలా?




ప్రజల అవసరాల కోసం ప్రారంభిస్తున్న కొత్త రైళ్ళకి ఏ అనారోగ్యం లేకుండానే (పట్టాలు ఎక్కకుండానే) విశ్రాంతి నిచ్చేసారు రైల్వే శాఖ వారు.

రైలు పట్టాలు ఎక్కాలంటే కావాల్సింది ప్రయాణికులూ మరియు సిబ్బందీ, కానీ రైల్వే వారికి ముఖ్యమంత్రి కావాలట.

కొత్త రైలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రే కావాలని వారు అనుకుంటే, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైలు వెయ్యాల్సింది. అంతేకానీ ఒకరోజు ముందు రేపటి ట్రైన్ రద్దు అయ్యింది డబ్బులు తిరిగి ఇస్తాం అంటే ప్రయాణికుల పట్ల వీరికి ఉన్న బాధ్యత బాగా అర్ధం అవుతుంది.

సామాన్య ప్రజల అవసరాల కన్నా అధికారంలో ఉన్న నాయకుల మెప్పుదలే ముఖ్యం అన్నట్లు వారు చేసిన పని.

ఓ మనిషి అనారోగ్యానికి వేలమంది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి?

మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆరోగ్యం గా ఉంటారో అప్పుడే ప్రారంభిస్తారా ఏమిటి ఈ రైళ్ళు? నాయకుల అనారోగ్యాలకూ ప్రజావసరాలు బలి అవ్వాలా.

(news courtesy: ఈనాడు)

Friday, 3 September 2010

శ్రీధర్ కార్టూన్ లో తప్పేంటి?




ఈ రోజు ఈనాడు పేపర్లో  ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మీద కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించిందట. ఆ కార్టూన్ ఒక వయోవృద్ధుడి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ అని వారి భావన.

రోశయ్య గారు వయో వృద్దులు మాత్రమే అయి ఉంటే శ్రీధర్ ఆ కార్టూన్ వేస్తే అభ్యంతరకరం ఏమో కానీ రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నప్పుడు ఆ కార్టూన్ లో అభ్యంతరం ఏముంది.

అది ముఖ్యమంత్రి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ గా మాత్రమే నాకు అర్ధం అయ్యింది కానీ ఒక వృద్ధుడిని అపహాస్యం చేసిన కుసంస్కారం అందులో నాకు కనిపించలేదు.

దశాబ్దాల తరువాత ఒక మంచి ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, తమ పార్టీ మహానాయకుడు గతించి ఏడాది గతించిన సందర్భంగా అంజలి ఘటించటానికి సహకరించని ఆరోగ్యం మన ముఖ్యమంత్రి ది.

పెద్దవాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవటం చాలా అవసరమే కానీ అది అనుక్షణం ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పదవుల్లో కూర్చోబెట్టి మాత్రం కాదు.

మామూలు ఉద్యోగులు 58/60 సంవత్సరాల వయసు దాటితే ప్రభుత్వానికి పనికి రారు కానీ 75/80 సంవత్సరాలు దాటిన, నిలబడితే కూర్చోలేని, కూర్చుంటే నిలబడలేని వృద్ధనాయకులు మాత్రం బాగా పనిచెయ్యగలరట. రాజకీయ నాయకులకు వాళ్ళు చనిపోయినప్పుడు కానీ రిటైర్మెంట్ రాదు.

అయినా రాజకీయాల్లో యాభై ఏళ్ల వాళ్ళని యువ నాయకులుగా భావించే మన దేశం లో 90 ఏళ్లు వచ్చినా అది పెద్ద వయసు అనిపించదు కదా.... ఏమంటారు?

మీ

స్నేహితుడు



Monday, 23 August 2010

మానసం
















Sunday, 22 August 2010

తెలుగు తల్లి అంటే ఉలుకు ఎందుకు?


ఎప్పుడు చూసినా టి. ఆర్. యస్ అధ్యక్షులు తెలుగు తల్లి అంటే మండి పడుతూ ఉంటారు. అది ఎందుకో నా మట్టి బుర్రకు ఎప్పుడూ అంతుపట్టదు.

తెలుగు తల్లి అనేది తెలుగు భాషకు మాతృస్తానం ఇచ్చి తెలుగు ప్రజలందరూ గౌరవించు కోవటం అనుకుంటున్నాను. తెలంగాణలో ఉండాల్సింది తెలుగు తల్లి కాదు తెలంగాణా తల్లి అనటం ఏమిటో దానికి తెలంగాణా మేధావులు వంతపాడటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు. తెలంగాణా కావాలనుకునే వారి ఆకాంక్ష ను నేను తప్పు పట్టటం లేదు. తెలంగాణా, కోస్తాంధ్ర, రాయల సీమ అనేవి త్రిలింగ దేశం లోని వివిధ ప్రాంతాలకు ప్రతిరూపం గా చెప్పుకునే పేర్లు. కానీ తెలుగు అనేది ఈ మూడు ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష. మాండలికాలు, యాసలు వేరు అయినంత మాత్రాన మాతృభాష మారదుగా.

తెలుగు తల్లి అనేది తెలుగు ప్రజలందరికి తల్లే కదా? తెలంగాణా లోని భాష తెలుగు కాదా? ఆంధ్ర తల్లి అనో సీమ తల్లి అనో అని ఎవరన్నా అంటే అప్పుడు తెలంగాణా తల్లి అనే వాదన తీసుకు రావటం లో అర్ధం ఉంటుంది.

భాషకు మాతృస్తానం ఇచ్చి నప్పుడు ఏ ప్రాంతం వారు అయినా దాన్ని వ్యతిరేకించటం అర్ధ రహితం. తెలంగాణా కావాలనుకునే ఆకాంక్ష కోసం తెలుగు భాషను చిన్నబుచ్చ వద్దు.

మీ

స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Saturday, 21 August 2010

హీరోలు మాత్రమే దోషులా?


టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారో ఇరుక్కో బోతున్నారో అంటూ మీడియా అంతా హోరెత్తి పోతుంది. నిజంగా డ్రగ్స్ వాడటం తప్పే కాదనలేం. సినిమా హీరోలు హీరోయిన్లు అందరూ నిజజీవితం లో కూడా హీరోల్లా ఉండరనేది వర్తమాన భారతంలో జనమెరిగిన సత్యం.

సెలెబ్రిటీల వార్తలంటే ప్రజానీకానికి ఆసక్తి ఎక్కువ కాబట్టి మీడియా దృష్టి అంతా వీళ్ళ మీదే ఉంచి, ఈ సమస్య మూలాల మీద ఫోకస్ తక్కువ పెడుతున్నారు.

కొకైన్ ఎవరు కొంటున్నారు అనేదానికన్నా, అసలు కొకైన్ ఇండియాలోకి ఎలా వస్తుంది? సముద్ర మార్గం ద్వారానా? వాయు మార్గం ద్వారానా? ఏ మార్గం ద్వారా వచ్చినా కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారు.?

కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి ఇండియా లోకి వచ్చాక కూడా వివిధ నగరాలకు ఎలా చేరవేయ గలుగుతున్నారు. నిఘా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు?

ప్రతిపక్షాల వ్యవహారాల మీద, స్వపక్షంలో తోక ఝాడించే వారిమీద నిఘా పెట్టటానికే అధికారులను ఉపయోగించుకుంటున్నదా అధికార పక్షం.?



మన దేశ మాజీ రాష్ట్రపతినే బట్టలు విప్పి చెక్ చేసారట వేరే దేశపు అధికారులు. గోద్రాలో మతకల్లోలాలకి భాధ్యుడిని చేసి ఒక రాష్ట్ర ముఖ్య మంత్రికే వీసా మంజూరు చెయ్యలేదు అదే దేశం.

మరి మనం? మన దేశం లోకి వచ్చే దెవరో... వారు వెళ్ళారో లేదో... తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం.

విదేశీయులు విజిటింగ్ వీసా మీద వచ్చి ఏళ్లకేళ్ళు మనదేశంలో పాతుకు పోతుంటే అధికార యంత్రాగం ఏం చేస్తున్నట్లు.?

అసలు విజిటింగ్ వీసాల మీద వచ్చి గడువు లోపల దేశం విడవని వారి వివరాలు & ఫోటోలు అన్ని రాష్టాల పోలీసు యంత్రాగానికి అందించి అలాంటి ఎలుకల్ని కలుగుల్లో నుండి బయటకు ఎందుకు రప్పించరు.?

ఇలాంటి వాళ్ళే నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నారు. వేలాది మంది విజిటింగ్ వీసాల మీద, ఇరుగు పొరుగు దేశాల నుండి తప్పుడు వీసాల మీద వచ్చి ప్రధాన నగరాల్లో  పాతుకు పోయి దేశాన్ని నాశనం చేస్తున్నారు.

పొరుగు దేశాల నిఘా వర్గాలు దొంగ నోట్లు ముద్రించి మన దేశం లో వాటిని చెలామణి చేసి మన ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నసంగతి తెలిసీ వాటిని నిరోధించలేని మన నిఘా వ్యవస్తని సంస్కరిస్తే దేశానికి ఎన్నో ఇక్కట్లు తొలగి పోతాయి.

ఇంటలిజెన్స్ వర్గాలని అధికార పక్షాలు తమ ఇంటి పాలేరులుగా వాడుకోవటం మానేసి దేశం లో అసాంఘిక శక్తుల మీద నిఘా పెంచితే బాగుంటుంది.

కనీసం మీడియా తమ ప్రయత్నం గా ఇలాంటి విషయాల మీద చొరవ చేస్తే బాగుండు.

రాజ్ భవన్లో మాజీ గవర్నర్ శృంగార లీలల మీద కాదు స్టింగ్ ఆపరేషన్ లు చెయ్యాల్సింది. దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేసే వర్గాలను బయట పెట్టే స్టింగ్ ఆపరేషన్ లు కావాలి.

అలా చెయ్యబోయే తొలి జర్నలిస్ట్ కి ఇప్పుడే చేస్తున్నా పాదాభి వందనం.

మీస్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)


Monday, 15 March 2010

నూతన వధువు

పెళ్లి పందిరిలో నూతన వధువులా చిరు నవ్వులు చిందిస్తూ
శోభన గదిలో కన్నె పిల్లలా సిగ్గులమొగ్గలు పూయిస్తూ..
వస్తున్న సరికొత్త సంవత్సరమా..
కొత్త కోరికలా కళ్యాణమండపం లో
అంతులేని ఆశల పీటలు
నీ కోసం కొలువు తీరి ఉన్నాయిలే..

వడివడిగా పరుగులిడే నిత్య యవ్వనుడు
ఆ కాలపురుషుడే నీ వరుడమ్మా...
ఎన్నడు ఆగక అలుపే ఎరగక గిర్రున తిరిగే
కాలచక్రమే పూజారి
గతవత్సరపు వెలుగు నీడలే
జలతారు పరదాలు
ఎన్నో కోరికలే సన్నాయి మేళాలు
ఎనలేని ఆశలెన్నో ఈ పెళ్ళికి బాజాలు
గతకాలపు తీపిగురుతులే మామిడి తోరణాలు.

నిముషాలన్నీ కలసి నుదుటిన బాసికమై
ప్రతి క్షణమూ నీ పెళ్లి సందడియై
ప్రజలందరి ఆనందం అక్షింతల జల్లై
ప్రతి ఒక్కరి శుభాకాంక్షలూ పెళ్లి కానుకలై
ఆరు రుతువులూ ఆహుతులై
చేదుఘటనలే అగ్ని హోత్రమై
తీపివార్తలే పెళ్లి విందుగా
కొంగుముడి పడుతుందీ కాలపురుషుని ధర్మపత్నిగా



Sunday, 14 February 2010

అసమర్ధుని ప్రేమలేఖలు - 2

ప్రియా...

తనను తాను మర్చిపోవటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఏ కొద్ది మందికో తప్ప.

ఆ కొద్దిమందిలో నేనూ ఒకడిని అయినందుకు గర్వపడాలో... ఆ అనుభూతిని నాకు పంచిన నువ్వు దూరమైనందుకు బాధ పడాలో అర్థం కాక నా మనసు విల విల లాడుతుంది.

నిజం ప్రియా...

నీ సన్నిధిలో నేను గడపిన ప్రతీక్షణం నన్ను నేను మరచిపోయాను. నా కంటూ ఓ మనసు, ఓ ప్రాణం, ఓ శరీరం ఉందని నేను మరచిపోఎంత మధురానుభూతులు నీ సాన్నిహిత్యం లో నాకు లభించాయి. నాకు సంబంధించినంత వరకూ ఆ మధురనుభూతులన్నీ అవ్యక్తానుభూతులే.

ఆ అనుభూతులన్నీ భవిష్యత్తులో జ్ఞాపకాలుగా మారిపోతాయని ఏనాడూ నేను అనుకోలేదు. ఈనాడేమో... ఒకనాటి నిజాలన్నీ నేడు జ్ఞాపకాలే అని తలచుకుని ఆ జ్ఞాపకాలే ఊపిరిగా మార్చుకుని బతుకుతున్నాను.

నువ్వు నాకు మాత్రమే జ్ఞాపకమని... మరో చోట నువ్వు నిత్య నూతన సౌభాగ్యానివి అని నా మనసుకి సర్ది చెప్పి ఊరడిస్తున్నాను.

కానీ అదేమీ బండరాయి కాదు కదా నా ఊరడింపులు వినటానికి.

కొన్ని వసంతాలు నీ ధ్యానమే ప్రాణం గా నీ రూపమే జీవం గా నీ తలపులే ఊపిరిగా నీ ఊహలే ఆశలుగా మార్చుకుని ఉన్న ప్రేమ పూరితమైన మనస్సు అది. అందుకే నామాటలు దానిని సంతృప్తి పరచలేకపోయాయి.

" ఓసి పిరికి మనస్సా... ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనం? తన సాన్నిహిత్యం గతం లోకి జారక మునుపే ధైర్యం చెయ్యాలి. ధైర్యం లేకుండా ఏదైనా ఎలా సిద్ధిస్తుంది. ?" అని నేను నా మనస్సుని దెప్పి పొడిచాను.

"ఓ అసమర్ధ ప్రేమికుడా.. నాకు ధైర్యం లేక కాదయ్యా... నీ ప్రియురాలి సాన్నిహిత్యం దూరం అవుతుందేమో అని నీవే ఆవిషయం బయట పెట్టవద్దు అన్నావు. ఇప్పుడు నువ్వు చింతిస్తూ నన్ను బాధపెడతావెందుకు?" అని నన్నే మందలించింది.

నిజమే ఇప్పుడు బాధ పడి ఏమి ప్రయోజనం... నీ హితం కోరుకోవటం తప్ప....

నీ

....

Saturday, 13 February 2010

అసమర్ధుని ప్రేమ లేఖలు - 1


ప్రియా..

తొలి వలపు వలచిన నాడు అనుకోలేదు...
ఈ వలపు తలపులకే పరిమితమని.

తొలి తలపు మది తట్టినప్పుడు అనుకోలేదు...
జీవితాంతం నా తోడు తానేనని.

తొలి ఊహ మదిలో మెదలినప్పుడు అనుకోలేదు
జీవితాంతం ఆ ఊహలు మాత్రమే ఊపిరి అని

తొలి ఆశ నన్ను తట్టినప్పుడు అనుకోలేదు
నా ఆలోచనలు ఆశల వరకే పరిమితం అని

చిన్నప్పుడు ఆడుకున్న బుల్లి బుల్లి ఆటలు నిజమైతే ఎంత బాగుండు. ఆ రోజులే కనుక తిరిగి వస్తే?
తలచుకుంటేనే మదిలో ఆనందం, హృది లో సంతోషం, ఎదలో పులకింత

నిజం ప్రియా...

ఆ రోజులూ నేటి ఆలోచనలు కలగలసి వస్తే నా అంతటి అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడు.

కానీ అది సాధ్యమేనా? కాలాన్ని వెనక్కి తిప్పటం సాధ్యమేనా?

నాకు కాలం మీద పరిశోధనలు చెయ్యాలని ఉంది. కాలాన్ని వెనక్కి తిప్పటం కోసం.

ఎప్పటికీ చిన్న పిల్లలం అయిపోయినా బాగుండు. కనీసం స్నేహితుడు గా అయినా ప్రతీ రోజూ నీ సన్నిధిలో ఉండేవాడిని.

గడచిన జన్మలో ఏ ప్రేమ జంటను విడదీసానో.. ఈ జన్మలో ఈ వేదన నాకు...


నీ......

Tuesday, 2 February 2010

ఓ లక్ష్మణ రావు గారూ



ఓ పసితనం మాడిన వేళ, ఓ పితృ హృదయం ఆగిన వేళ యావత్ ప్రపంచం దృష్టీ అక్కడే ఉంది. కసాయి వెధవలు కిరాయి కోసం చేసిన ఘాతుకాన్ని అందరూ ఖండించటం నిజం గా హర్షణీయం.

కానీ వీళ్ళ కుటుంబ వ్యవహారాలతో ఏ సంబంధం లేని ఓ పేద డ్రైవర్ హత్య మాత్రం ఏ ఒక్కరి కంటికీ ఆనక పోవటం (ప్రధాన మీడియా తో సహా) అంటే బాధాకరం. నా వరకూ నాకు ఎవరి హత్య అయినా ఒక్కటే. కారు డ్రైవర్ లక్ష్మణ రావు, చిన్నారి తల్లి వైష్ణవి ల హత్యలతో ప్రత్యక్షం గా, వైష్ణవి తండ్రి ప్రభాకర్ చావుకి పరోక్షం గా సంబంధం ఉన్న నరరూపరాక్షసులు అందరినీ బహిరంగంగా ఒక్కొక్క అవయవాన్ని రంపాలతో కోసి చంపాలి.

కిడ్నాప్ కి గురైన రోజున (చనిపోయిన వార్త తెలిసేంత వరకూ) నాగ వైష్ణవి పేరు గానీ, ఆమె తండ్రి ప్రభాకర్ పేరు గానీ తెలియని వారే లేరు. కానీ తనకు సంబంధం లేని గొడవల్లో తొలి సమిధగా మారిన కారు డ్రైవర్ లక్ష్మణ రావు పేరు ఎంత మందికి తెలుసు. చావుకి పేదైనా గొప్ప అయినా ఒక్కటే. ఓ పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి పోతే ఆ కుటుంబానికి ఆలంబనే ఉండదు. తన కోసం మనమేమీ చెయ్యలేకపోయినా అశ్రువొక్కటి ధారపోద్దాం.

ఓ లక్ష్మణ రావు గారూ, అందుకోండి మీ ఆత్మశాంతి కోసం నా అశ్రు నివాళి.

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Friday, 8 January 2010

హలో... బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త ...




ఏదో దిక్కు మాలిన వెబ్ సైట్ ఓ ఊహా జనిత కధనాన్ని ప్రచురిస్తే తమ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏదో సినిమాకథ లాంటి ఆ కధనాన్ని జనాల మీదకు వదిలాయి మన తెలుగు వార్తా సంస్థలు. ఎప్పుడే గొడవ చేద్దామా మన దురద తీర్చుకుందామా అని కాచుకుని కూర్చునే రాజకీయ రోమియోలు, వాళ్ళ అనుచరులు రాత్రి కి రాత్రి అరాచకం సృష్టించేసారు. రాబోవు పరిణామాలు ఆలోచించకుండా తమ టి.ఆర్.పి రేటింగ్స్ కోసం ప్రసారం చేసిన కథనమో, మరి కొందరు అంటున్నట్లు రాజకీయ కుట్రలో భాగమో  మనకు తెలియదు కానీ మన బ్లాగు సోదరులు చాలా మంది కూడా ఆ కథనం ప్రభావంలో పడి పోయి నేను అప్పుడే చెప్పాను అలా జరిగి ఉండవచ్చు అని, ఇలా జరిగి ఉండవచ్చు అని మళ్ళీ బ్లాగేశారు.

కానీ బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త....

మీరు రాసే మీ ఊహాజనిత కధనాలు ఏ ఛానల్ వాడికో తెగ నచ్చేసి వాటిమీద ఏ వెర్రి వెంగళప్పతోనో చర్చ పెట్టేసి ఓ మూడు నాలుగు గంటల పాటు చర్చ పెట్టేసినా పెట్టేస్తారు పలానా బ్లాగ్ లో ఇలా అంటున్నారు అని. ఇలాంటి కథనాల కోసమే కాసుక్కూచ్చునే బాచ్ తెగులునాట ఏ మూల కెళ్ళినా రెడీ గా ఉంటారని ప్రత్యేకం గా మళ్ళీ చెప్పాలా నిన్న రాత్రి జరిగిన దాన్ని చూసాక.

బ్లాగ్ పాపులారిటీ ఏమో గాని ఆనక పోలీసుకేసులూ గట్రా మన నెత్తి మీదే. ఆ రష్యా వాడైతే మన వాళ్లకి వెంటనే దొరక్క పోవచ్చు కానీ మనమైతే వీళ్ళ చేతులకి చిక్కటం క్షణాల్లో పని.

ఇక నుండి ఇలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండవచ్చు అని మనం చెప్పాలన్నా మీడియా దెబ్బ కి మన జాగ్రత్త లో మనం ఉండాలి. కాబట్ట్టి బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త.....

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Thursday, 7 January 2010

మనం మనుషులమా గొర్రెల మందల్లో గొర్రెలమా?



దాదాపు గత రెండు నెలలు గా మన రాష్త్రం లో జరుగుతున్న పరిణామాలు, వాటి పై కొంతమంది జనం స్పందిస్తున్న తీరు చూస్తుంటే పై అనుమానం రాక మానటం లేదు.

ఏమిటీ గత కొంత కాలం గా మనకీ మంట?.

తెలుగుజాతికి ఏదో పీడ పట్టినట్లు మనలో మనమే కొట్టుకోవడం.

పాకిస్తాన్ ఇండియా సైనికుల్లా, కాలికి కత్తి కట్టిన పందెంకోళ్ళలాగా రెండువర్గాలుగా మనం విడిపోయి కొట్టుకొంటుంటే ఏదో రిఫరీ లా ఆ అరవ చిదంబరం గారు ఉన్నట్లు ఉన్నారు.

జై తెలంగాణా అన్న నాయకుల సంబంధీకులు కానీ, జై సమైఖ్యాంధ్ర అనే నాయకుల బంధుగణం లో కానీ ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నారా.? సామాన్య జనం తప్ప. వాళ్ళు జై అని మాత్రమే అంటారు... తమ రాజకీయ పునాదులు ఆ నినాదాల్లో తవ్వుకుని ఉంటారు కాబట్టి! కానీ మనం మాత్రం గొర్రెల మందల్లా జై జై అంటూ ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటాం. ఆ ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తుల కుటుంబాలు పడే క్షోభని ఈ రాజకీయ నాయకులు, విద్యాలయాల్లో చదువులు చెప్పటం మాని ఉద్యమాలు ఎలా చెయ్యాలో చెప్పే అధ్యాపకులు తీర్చగలరా?

మన ఆస్తులు మనమే నాశనం చేసుకుని మనం బాపుకున్నదేమిటి. బస్సు చార్జీల మోత తప్ప. రవాణా చార్జీల పెంపు ఒక్కటి చాలు మనలాంటి సామాన్యుల జీవితాలని అస్తవ్యస్తం చెయ్యటానికి. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఖరీదులోనూ రవాణ చార్జీ మిళితం అయి ఉంటుంది కాబట్టి.

ఈ రోజున ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయగలిగే నైతికత మనలో ఉందా.? ప్రభుత్వ ఆస్తి అంతే పౌరుల ఆస్తే కదా. మన ఆస్తి మనమే నాశనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏమని అడగగలం.

ఉద్యమాల ముసుగులో అరాచక శక్తులకు ఊతం ఇవ్వడం తప్ప ఇంతవరకూ ఎవరికి అయినా ఒరిగింది ఏమిటి.? గొర్రెల మందల్లో గొర్రెల్లా ముందున్న వాడిని అనుసరించి మన జీవితాలని నాశనం చేసుకోవటం తప్ప?

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)